పాకిస్తాన్ వాళ్ల కోసం వెతుకుతుంటే, బయటపడ్డ 400 మంది బంగ్లాదేశీయులు

NOB_While search for Pakistanis, 400 Bangladeshis revealed

ChenethaTV- Gujarat news: పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం భారత ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల హోమ్ శాఖలతో పాటు డీజీపీలకు అక్రమంగా భారత్ లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపించాలని ఆదేశాలు అందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు పాకిస్తానియులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో ఊహించని పరిణామం ఎదురైంది. 26.04.2025 న ఉదయం 3 గంటల నుంచి అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, SOG, EOW, జోన్ 6, ప్రధాన కార్యాలయాల బృందాలతో కలిసి, అహ్మదాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ వలసదారులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించింది. పాకిస్తాన్ పౌరుల కోసం నిర్వహించిన ఈ ఆపరేషన్ సమయంలో, 400 మందికి పైగా అనుమానాస్పద వలసదారులు బయటపడ్డారు. వీరంతా రాష్ట్రంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారత పౌరులుగా కొనసాగేందుకు ప్రయత్నించారు. తాజా తనిఖీల్లో వారి బండారం బయటపడినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అజిత్ రాజియన్ తెలిపారు. వారిలో అత్యధికంగా బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే మిగిలిన వారి వద్ద ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పాకిస్తానీయుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *