
ChenethaTV- Karnataka news: కర్ణాటకలో మాజీ డీజీపీ ఓం ప్రకాష్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. కర్ణాటక డీజీపీగా, ఐజీపీగా పనిచేసి రిటైర్ అయిన ఓంప్రకాష్ అతని ఇంట్లో శవమై కనిపించారు. బెంగళూరులోని హెచ్ఎస్ ఆర్ లే అవుట్లోని ఆయన నివాసంలో ఓంప్రకాష్ హత్యకు గురయ్యారు. 20.04.2025 సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓంప్రకాష్ హత్య కేసులో ఆయన భార్యను ప్రధాన అనుమానితురాలిగా భావిస్తున్నారు. ఓం ప్రకాష్ హత్యకు గురైన విషయాన్ని పోలీస్ కమిషనర్ దయానంద ధ్రువీకరించారు. రక్తపు మడుగులో ఇంట్లో శవమై కనిపించిన మాజీ డీజీపీ, భార్యపైనే అనుమానాలు! ఓం ప్రకాష్ మృతదేహాన్ని 20.04.2025 సాయంత్రం 5 గంటల 30 నిమిషాల సమయంలో బెంగళూరు లోని హెచ్ఎస్ఆర్ లే అవుట్లో ఉన్న ఆయన నివాసంలో గుర్తించారు. రక్తపు మడుగులో ఓం ప్రకాష్ మృతదేహం పోలీసులకు కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ను ఆయన భార్యే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఓం ప్రకాష్ శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై తామింకా ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడలేదని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. పూర్తి సమాచారం అందిన తర్వాత ఓం ప్రకాష్ మృతిపై మాట్లాడతామని చెప్తున్నారు.మరోవైపు ఓం ప్రకాష్ భార్య అంతకు ముందు ఓ వాట్సప్ మెసేజ్ షేర్ చేసినట్లు తెలిసింది. తన భర్త ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నా డని తనను చంపాలనే ఉద్దేశంతో ఉన్నాడని అందులో ఓంప్రకాష్ భార్య పేర్కొన్నట్లు సమాచారం, అయితే ఆమెకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలిసింది. దీనిపైనా పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఓం ప్రకాష్ భార్యను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.